నిథమ్ లో డెస్టినేషన్ తెలంగాణ - రోడ్ అహెడ్స్ థీమ్ తో పర్యాటక సదస్సు
హైదరాబాద్, మే 22: తెలంగాణ పర్యాటక రంగానికి దిశానిర్దేశం చేసేందుకు, పర్యాటక రంగ అభివృద్ధిలో కీలక భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (NITHM) సిద్ధమైంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం, మే 23, 2026న గచ్చిబౌలిలోని నిథమ్ ప్రాంగణంలో “డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ అహెడ్” అనే థీమ్ తో ప్రతిష్టాత్మక పర్యాటక సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.ఈ సదస్సులో భాగంగా పర్యాటక రంగానికి సంబంధించిన కీలక ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవడంతో పాటు తెలంగాణ పర్యాటక 'బ్రాండ్ కిట్'ను ఆవిష్కరించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ '99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా పర్యాటక వారోత్సవాల సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు నిథమ్ డైరెక్టర్ ప్రొ.వెంకటరమణ తెలిపారు. తెలంగాణ పర్యాటక పోస్టర్ల ప్రదర్శన, ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టీజీటీడీసీ మెనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రజింత్ నాయక్, తదితరులు సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు.
సదస్సులో భాగంగా పర్యాటక రంగ భవిష్యత్తుపై పలు కీలక చర్చలు జరగనున్నాయి. టీసీఎస్ కన్సల్టింగ్ తరుణ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన 'డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ అహెడ్' అనే అంశంపై సీఈఓల ప్యానెల్ చర్చ జరగనుంది. ఇందులో ఎఫ్టీసీసీఐ (FTCCI), టీఏఏఐ (TAAI), అలంకృత రిసార్ట్, వెడ్డింగ్ బై పటవార్, తాజ్ డెక్కన్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
అదేవిధంగా, రాష్ట్ర వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి అధ్యక్షతన 'వారసత్వ సంపద పరిరక్షణ - పర్యాటక హిత నగరాల నిర్మాణం' అనే అంశంపై మరో కీలక సెషన్ నిర్వహించనున్నారు. ఈ సెషన్లో హెచ్ఎండీఏ (HM&UD) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వర్చువల్ పద్ధతిలో పాల్గొననుండగా, ఇన్టాక్ (INTACH) ప్రతినిధి వేద కుమార్ మాణికొండ ప్రసంగిస్తారు.
చివరగా, 'తెలంగాణను గ్రీన్ అండ్ సస్టైనబుల్ టూరిజం హబ్గా మార్చడం' అనే అంశంపై రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ రంజిత్ నాయక్ ఐఎఫ్ఎస్ అధ్యక్షతన ప్యానెల్ చర్చ జరగనుంది. ఇందులో రామోజీ ఫిల్మ్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఎ.వి. రావు మరియు ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ డాక్టర్ జి.బి.కె. రావు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, వారసత్వ కట్టడాల పరిరక్షణ, సుస్థిర పర్యాటక పద్ధతులను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని వెంకటరమణ తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0



